Monday 5 January 2015

నేడే వరల్డ్ కప్ కు టీంని ఎంపిక చేస్తున్నఇండియా

2015 ప్రపంచ క్రికెట్ కప్ కు భారత్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న టీంఇండియా జట్టును నేడు బీసీసీఐ ఎంపిక చెయ్యనుంది. కాగా చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలో ముంబైలో భేటీకానున్న సెలక్షన్ కమిటీ నేడు జట్టును ఎంపిక చెయ్యనుంది. ఇక 2011 వరల్డ్ కప్ లో శ్రీలంకతో ఆడిన ఫైనల్ మ్యాచ్ లో ధోనీతో కలిసి మంచి ఆటను ప్రదర్శించిన యువరాజ్ సింగ్ కు ఈసారి వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కనుందో లేదోనని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా ఆల్ రౌండర్ కోటాలో జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్న రవీంద్ర జడేజా గాయం కారణంగా వరల్డ్ కప్ నుండి దాదాపు వైదొలగనున్న నేపధ్యంలో అతని స్థానంలో యూవీని తీసుకునే అవకాశంవుంది. అలాగే ఇప్పటికే రంజీలలో సత్తా చాటుతున్న యూవీ వైపే సెలక్షన్ కమిటీ కూడా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే అదే సమయంలో జడేజా స్థానంలో యూవీతో పాటు అక్షర్ పటేల్ పేరును కూడా కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి భారత్ తరపున క్రికెట్ వరల్డ్ కప్ లో ఎవరెవరు ఆడబోతున్నారో అనే సస్పెన్సుకు ఈ రోజుతో తెరపడనుంది.

ఇకపై వెంకన్న దర్సనపు టిక్కెట్లు పోస్టాఫీసుల్లో..!

ఇకపై ఆ ఏడు కొండల వెంకన్న దర్శనం సామాన్య ప్రజలకి మరింత చేరువ కానుంది. టీటీడీ దర్శన టికెట్లను తపాల ఆఫీసుల్లో అమ్మనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 97 పోస్ట్ఫాసుల్లో ఇ-దర్శనం టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు టిటిడి ఇవో సాంబశివరావు తెలిపారు.
రోజుకు 5 వేల టిక్కెట్ల చొప్పున విక్రయిస్తారని సోమవారం ఆయన విలేకరులకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇవి అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.